శ్రీహరికోట: మరికాసేపట్లో చంద్రయాన్-3(Chandrayaan-3) నింగికి ఎగరనున్న విషయం తెలిసిందే. అయితే రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రీతూ కర్దివాల్ శ్రీవాత్సవ్(Ritu Karidhal Srivastava) ఆ ప్రాజెక్టును లీడ్ చేస్తున్నారు. ఇస్రో చరిత్రలో మైలురాయిగా మారనున్న ఆ ప్రాజెక్టు గురించి రీతూ ఎన్నో విషయాలు చెప్పారు. ఇస్రోలో ఆమె సీనియర్ సైంటిస్టుగా చేస్తున్నారు. మార్స్ ఆర్బిటార్ మిషన్ లోనూ రీతూ కీలక పాత్ర పోషించినట్లు వుమెన్ ఎకనామిక్ ఫోరమ్ తెలిపింది. రీతూ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1996లో లక్నో వర్సిటీ నుంచి ఫిజిక్స్లో ఎంఎస్సీ చేసిందామె. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంటెక్ చదివింది. రీతూ చాలా బ్రైట్ స్టూడెంట్ అని లక్నో వర్సిటీ టీచర్లు పేర్కొన్నారు. చాలా చిన్న తనం నుంచి అంతరిక్ష విషయాలపై శ్రీవాత్సవ్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇస్రో కానీ, నాసా కానీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు చెందిన ఆర్టికిల్స్ను ఆమె స్కూల్ డేస్లో సేకరించేవారు.
1997లో రీతూ ఇస్రోలో సైంటిస్టుగా చేరారు. అప్పటి నుంచి ఇస్రో చేపట్టిన ఎన్నో మిషన్స్లో ఆమె ముఖ్యభూమిక నిర్వహించారు. చాలా మిషన్స్కు ఆపరేషన్స్ డైరెక్టర్గా బాధ్యతాయుతమైన పోస్టు నిర్వర్తించారు. జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్స్లో దాదాపు 20కిపైగా పేపర్స్ రాశారామె. చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్గా ఇప్పుడు రీతూ మరో చరిత్ర సృష్టించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 610 కోట్లు ఖర్చు చేశారు.
రాకెట్ వుమెన్ రీతూ ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. యంగ్ సైంటిస్ట్ అవార్డు, ఇస్రో టీమ్ అవార్డు, ఏఎస్ఐ టీమ్ అవార్డు, సొసైటీ ఆఫ్ ఇండియా ఏరోస్పేస్ టెక్నాలజీ అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.