న్యూఢిల్లీ: గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి విస్తృతంగా ఉపయోగించే రిస్క్ కాలిక్యులేటర్లు భారతీయుల అనారోగ్య వాస్తవ ప్రమాద స్థాయిని గుర్తించడంతో పెద్ద సంఖ్యలో విఫలమవుతున్నాయని కొత్త పరిశోధన తెలిపింది. గుండెపోటు వచ్చిన రోగుల్లో సుమారు 80 శాతం మందిని ముందుగానే ‘హై రిస్క్ కేటగిరీగా గుర్తించడంలో ఇవి విఫలమైనట్టు ఈ అధ్యయం వెల్లడించింది.
గోవింద్ వల్లభ్ పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, ఫరీదాబాద్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, ఎయిమ్స్లోని ఢిల్లీ కేన్సర్ రిజిస్ట్రీ శాస్త్రజ్ఞులు ఈ పరిశోధన నిర్వహించారు. తొలిసారిగా గుండెపోటు వచ్చిన 4,975 మంది రోగులపై పరిశోధన నిర్వహించి ఐదు హృద్రోగాల నిర్ధారణలో ప్రపంచ ప్రమాద అంచనా నమూనాల ప్రకారం వ్యక్తులను వర్గీకరించే విధానంలో గణనీయమైన తేడాలున్నట్టు గుర్తించారు.
డబ్ల్యూహెచ్ రిస్క్ చార్టుల వంటి టూల్స్ కొన్ని తొలిసారి గుండెపోటును వచ్చిన వారిలో ఇవి ప్రమాదాన్ని పూర్తిగా గుర్తించలేక పోయాయి. వీటిలో కొన్ని మోడల్స్ 20 శాతం మందిని మాత్రమై హై రిస్క్ కింద గుర్తించగా, మిగిలినవి దారిదాపుల్లో కూడా ఆ విషయాన్ని నిర్ధారించలేక పోయాయి. ఏఎస్సీవీడీ 2013 మోడల్ అయితే 12.3 శాతం మాత్రమే రిస్క్ ఉన్నట్టు తెలిపింది.
మొత్తం మీద మెజారిటీ మోడల్స్ ఒక మాదిరి రిస్క్ కేటగిరీలోనే వారిని ఉంచినట్టు పరిశోధన గుర్తించింది. మొత్తం మీద ఈ పాశ్చాత్య మోడల్స్ను అనుకరించడం వల్ల భారతీయుల గుండెపోటు ప్రమాద స్థాయిని ముందుగా గుర్తించలేక పోతున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఒక వ్యక్తికి భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే అవకాశాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే గణిత మోడల్స్ లేదా టూల్స్నే రిస్క్ కాలిక్యులేటర్లు అంటారు.