Electricity Crunch | ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వేడితోపాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫలితంగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నది. వచ్చే వేసవిలో డిమాండ్కు తగినంత విద్యుత్ సరఫరా అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత నెలలో 211 గిగా వాట్ల విద్యుత్కు డిమాండ్ వచ్చింది. కరోనా మహమ్మారి తర్వాత పారిశ్రామిక కార్యకలాపాలు పునః ప్రారంభం కావడంతో ఆల్టైం రికార్డు నెలకొల్పిన గతేడాది విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. గత నెల గిరాకీ కూడా దాదాపు అదే స్థాయికి చేరుకున్నది. 122 ఏండ్ల క్రితం నాటి ఉక్కపోత పరిస్థితులు నెలకొంటున్నాయి.
దేశంలోని కొన్ని రీజియన్లలో గత వారం సాధారణ స్థాయి కంటే 11 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్నోగ్రతలు నమోదయ్యాయి. వేడి వాతావరణం ప్రభావం గోధుమలు, ఇతర పంటలపై పడకుండా చూసుకోవాలని వాతావరణశాఖ రైతులకు సూచించింది. అనూహ్యంగా వాతావరణం వేడెక్కితే పంటల సాగుకు అవసరమైన నీటి సరఫరాకు, ఇండ్లలో ఎయిర్ కండీషనర్ల వాడకానికి విద్యుత్ వాడకం పెరుగుతుంది. అదే జరిగితే డిమాండ్కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉండదన్న అనుమానాలు ఉన్నాయి. ఫలితంగా వరుసగా రెండేండ్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వేసవిలో బ్లాక్ఔట్లను నివారించడానికి, దేశీయ బొగ్గు సరఫరాలో ఒత్తిళ్లను తగ్గించడానికి విద్యుత్ తయారీ సంస్థలు వచ్చే మూడు నెలలకు అవసరమైన బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి. వచ్చే ఏప్రిల్లో 229 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేస్తున్నది. ఫిబ్రవరిలో అనూహ్య వేడి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుందని రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి భాన్వర్సింగ్ భటి తెలిపారు. గత వేసవితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 20-30 శాతం పెరుగవచ్చునని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తమకు విద్యుత్ కోతలు తప్పక పోవచ్చునన్నారు.
దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్లలోనే జరుగుతున్నది. కానీ ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 45 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మార్చి నాటికి అవసరమైన బొగ్గు నిల్వలు పెంచుకోవాలని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కేంద్రం సూచించింది. మార్చి నుంచి మే వరకు దేశవ్యాప్తంగా పూర్తిగా వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహాపాత్ర చెప్పారు.