బెంగళూరు, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ పాలిత కర్ణాటకలో మత కలహాల చిచ్చు కొనసాగుతున్నది. ఘర్షణలకు ప్రధానంగా రాష్ట్రంలోని బీజేపీ అగ్రనేతల సొంత ప్రాంతాలే అడ్డాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో గత మూడేండ్లలో 163 మత కలహాల ఘటనలు జరగ్గా.. అందులో అత్యధికం సాక్ష్యాత్తూ ప్రస్తుత రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర, మాజీ సీఎం యెడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలోనే చోటుచేసుకున్నాయి. శివమొగ్గలో 57 మత కలహాల ఘటనలు చోటుచేసుకోగా, బాగలకోటలో 22, దావణగెరెలో 18, దక్షిణ కన్నడ, కొడగు జిల్లాల్లో పదేసి చొప్పున జరిగాయి. బీజేపీ నేతలే తమ రాజకీయ లబ్ధి కోసం మత ఘర్షణలను రేపుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అంతకంతకు పెరుగుతున్న ఘటనలు
బీజేపీ అధికారం చేపట్టిన 2019లో మత ఘర్షణల సంఖ్య 19గా ఉన్నది. అయితే ఈ ఏడాది ఈ సంఖ్య ఇప్పటి వరకూ 96 వరకు పెరిగింది. వీటిలో ఒక్క శివమొగ్గ జిల్లాలోనే 42 ఘటనలు జరిగాయంటే సాక్ష్యాత్తూ రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 18 జిల్లాల్లో మత కలహాలు జరిగాయని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. మంగళూరు, గదగ్ జిల్లా నరగుంద్, శివమొగ్గలో జరిగిన అల్లర్లలో ముగ్గురు మరణించగా, వందల మంది సంఖ్యలో సామాన్యులకు గాయాలయ్యాయి. ఇక దాదాపు 3 వందల మంది పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఘర్షణల కారణంగా ఆస్తి నష్టం కూడా భారీగానే సంభవించింది.
వ్యక్తిగత కక్షలంటూ బుకాయింపు!
రాష్ట్రంలో పెరుగుతున్న మత ఘర్షణలపై హోంమంత్రి జ్ఞానేంద్ర స్పందన విచిత్రంగా ఉన్నది. ‘గతంలో కూడా మత ఘర్షణల ఘటనలు జరిగాయి. అయితే చాలా తకువగా కేసులు దాఖలయ్యేవి. ఇప్పుడు ఈ విషయంలో పోలీసులకు స్వేచ్ఛనిచ్చాం. అందువల్లే భారీగా కేసులు వస్తున్నాయి. చాలా అల్లర్లకు కారణం వ్యక్తిగత కక్షలే’ అని మంత్రి చెప్పుకురావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఎప్పుడైనా, ఏ సమయంలోరైనా మత ఘర్షణలు చోటుచేసుకొనే వాతావరణం నెలకొని ఉన్నదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, మంగళూరు, బాగలకోట, కల్బుర్గి జిల్లాల్లో మత కలహాల ఘటనలకు ఎకువ అవకాశం ఉందని నిఘా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలు రాజకీయ లబ్ధి కోసం జరుగుతుంటాయని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఓ పోలీసులు అధికారి ఒకరు చెప్పారు.