న్యూయార్క్: అమెరికాలో ఫ్రాడ్ స్కీమ్తో వృద్ధులను మోసం చేసిన కేసులో భారతీయుడికి 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2019-20 మధ్య ఓ ఫ్రాడ్ రింగ్(Ringleader) ఆపరేట్ చేసిన కేసులో ఎండీ ఆజాద్(MD Azad)ను దోషిగా తేల్చారు. అమెరికా జడ్జి కెన్నెత్ హోయట్ తన ఆదేశాల్లో ఆజాద్కు 188 నెలల జైలుశిక్ష ఖరారు చేశారు. హూస్టన్లో అక్రమంగా నివసిస్తున్న ఆజాద్.. మనీ ట్రాన్సఫర్ స్కీమ్ ద్వారా అమెరికాలోని పలు నగరాలకు చెందిన వృద్ధులను మోసం చేశాడు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి వ్యక్తిగత, బ్యాంకు, క్రెడిట్ కార్డు సమాచారాన్ని చోరీ చేశారు. ఆ తర్వాత ఫేక్ కాల్స్తో ఆ వృద్ధులను వేధించినట్లు అమెరికా అటార్నీ ఆలందార్ హమ్దాని తెలిపారు. ఈ కేసులో ఆజాద్ రింగ్ లీడర్ కాగా, అతనికి మరికొంత మంది భారతీయులు సహకరించారు. వారిలో అనిరుధ్ కల్కోటే, సుమిత్ కుమార్ సింగ్, హిమాన్షు కుమార్, ఎండీ హసీబ్ ఉన్నారు. ప్రస్తుతం అయిదుగురు కస్టడీలో ఉన్నారు. మిగితా వాళ్లకు కూడా శిక్ష పడాల్సి ఉంది. బాధితులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయినట్లు యూఎస్ అటార్నీ పేర్కొన్నారు.