Chidambaram : పెగాసెస్పై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సారి గతంలో కంటే మరింత రెట్టింపు ఖర్చుతో స్పైవేర్ను కొనుగోలు చేస్తారేమోనని కేంద్రంపై విరుచుకుపడ్డారు. గతంలో స్పైవేర్ను 2 బిలియన్ల యూఎస్ డాలర్లను వెచ్చించారని, ఈ సారి మరింత రెట్టింపుతో అంటే 4 బిలియన్ల యూఎస్ డాలర్లను వెచ్చిస్తారేమోనని సెటైర్ వేశారు. భారత్- ఇజ్రాయిల్ మధ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఇదే సరైన సమయం అని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఇజ్రాయిల్ వద్ద మరింత అడ్వాన్స్ వర్షన్తో వున్న స్పైవేర్ ఏదైనా వుందో అని అడగాలని అన్నారు.
ఇక కేంద్ర మంత్రి వీకే సింగ్పై కూడా చిదంబరం విరుచుకుపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ను సుపారీ మీడియాగా అభివర్ణించిన విషయం తెలిసిందే. దీనిపై చిదంబరం తీవ్రంగా మండిపడ్డారు. వాటర్గేట్ అవినీతి, పెంటగాన్ పేపర్లను వెలికి తీయడంలో ఆ రెండు పత్రికలు పోషించిన భూమిక అందరికీ తెలిసిందేనని అన్నారు. చరిత్ర చదవడం ఇష్టం లేకపోతే కనీసం సినిమాలైనా చూడాలని వీకే సింగ్కు చిదంబరం చురకలంటించారు.
గతేడాది పెగాసెస్ స్పైవేర్ ఉదంతం మామూలు వివాదాన్ని సృష్టించలేదు. రాజకీయ నేతలు, ప్రముఖులు, పలువురు జర్నలిస్టులపై పెగాసెస్ స్పైవేర్తో మోదీ ప్రభుత్వం నిఘా పెట్టిందని ప్రతిపక్షాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఈ అంశం పెద్ద దుమారాన్నే రేపింది. తాజాగా ఇదే అంశంపై న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. 2017 లోనే మోదీ సర్కార్ ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా స్పైవేర్ను కొనుగోలు చేసిందన్నది న్యూయార్క్ టైమ్స్ కథనం. దీంతో భారత్లో మళ్లీ పెగాసెస్ వివాదం మొదలైంది.