Rice Export Ban | బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. పండగలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా సరఫరాను పెంచే లక్ష్యంతో నిర్ణయం తీసుకోగా.. రిటైల్ ధరలు అదుపులో ఉండనున్నాయి. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. బాస్మతియేతర ఉస్నా బియ్యం, బాస్మతి బియ్యం ఎగుమతి విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. దేశం నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం బియ్యంలో బాస్మతీయేతర బియ్యం వాటా 25శాతం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సన్న బియ్యం మొత్తం ఎగుమతి 4.2 మిలియన్ల డాలర్లకు చేరువలో ఉన్నది. అంతకుముందు సంవత్సరంలో ఎగుమతులు 26.2 మిలియన్లు డాలర్లుగా ఉండేది. భారతదేశం ప్రధానంగా థాయ్లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాకు సన్న బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఖరీఫ్లో పంటల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బియ్యాన్ని కొద్దిరోజుల పాటు నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మరో ఇప్పటికే టమాట, పచ్చిమిర్చీ సహా పలు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.