న్యూఢిల్లీ: కొందరు యువకులు సరదాగా మెట్రో రైలులో రిబ్బన్ కటింగ్ వేడుక నిర్వహించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. ఆ యువకుల తీరుపై కొందరు మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మెట్రో రైలులో ప్రయాణించిన కొందరు యువకులు ప్రవేశ ద్వారం వద్ద ఒక రిబ్బన్ కట్టారు. ఇంతలో ఒక స్టేషన్లో మెట్రో రైలు ఆగింది. కొందరు ప్రయాణికులు అందులోకి ఎక్కారు. అయితే ప్రవేశం వద్ద అడ్డుగా రిబ్బన్ ఉండటం చూసి కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. రిబ్బన్ కింద నుంచి వెళ్లేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు.
కాగా, ఇంతలో ఆ రిబ్బన్ కట్టిన వారికి చెందిన యువకుడు ఒక కత్తెర తీసుకుని అక్కడకు వెళ్లాడు. ఒక ప్రయాణికుడికి దానిని ఇచ్చి రిబ్బన్ కట్ చేయమని చెప్పాడు. కొంత కన్ఫ్యూజ్ అయిన ఆ వ్యక్తి చివరకు కత్తెరతో రిబ్బన్ను కట్ చేశాడు. దీంతో మిగతా ప్రయాణికులంతా ఆ మెట్రో రైలులోకి ప్రవేశించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘ఢిల్లీ మెట్రోలో రిబ్బన్ కటింగ్ సెర్మనీ’ కుడోస్ అని పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. కొందరు లాఫింగ్ ఇమోజీలతో తమ నవ్వును వ్యక్తం చేశారు. మరి కొందరు మాత్రం ఆ యువకుల చర్యపై మండిపడ్డారు. మెట్రో రైలులోకి కత్తెర తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం సరదా అంటూ మరి కొందరు ఘాటుగా వ్యాఖ్యానించారు.