Supreme Court | ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (Economically Weaker Section) రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడాన్ని వ్యతిరేకించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటాపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు రిజర్వేషన్లను సమర్థించారు.
జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను సమర్థించడంతో పాటు 50శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించదని అభిప్రాయపడ్డారు. అయితే, అప్పటి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం విధితమే. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత డాక్టర్ జయకుమార్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.