న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మూడు రకాల సిరంజిల ఎగుమతిపై కేంద్రం 3 నెలల పాటు ఆంక్షలు విధించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమ వేగం కొనసాగాలంటే సిరంజిలు అందుబాటులో ఉండాలని, దాని కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 0.5 ఎంఎల్/1 ఎంఎల్ ఏడీ (ఆటో-డిజేబుల్), 0.5 ఎంఎల్/1 ఎంఎల్/2 ఎంఎల్/3 ఎంఎల్ డిస్పోజబుల్, 1 ఎంఎల్/2 ఎంఎల్/ 3 ఎంఎల్ ఆర్యూపీ (రీ యూజ్ ప్రివెన్షన్) సిరంజిల ఎగుమతిపై ఆంక్షలు విధించినట్టు పేర్కొంది. ఇది ఎగుమతులపై నిషేధం కాదని వివరణ ఇచ్చింది. గత సోమవారం సిరంజిల ఎగుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్టు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దానిపై ఆలిండియా సిరంజిలు, సూదుల తయారీదారుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మూడు రకాల సిరంజిలపై మాత్రమే ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది.