Odisha Train Accident | ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 280కి పైగా ప్రయాణికులు మరణించగా మరో 1000 మంది వరకు గాపడ్డారు. రైలు ప్రమాదాలకు సంబంధించి దేశ చరిత్రలోనే భారీగా ప్రాణ నష్టాన్ని కలిగించిన ఈ ఘటనలో పలు అనుమానాలు తలెత్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చే పనిలో రైల్వే అధికారలు నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పదమా?.. లేక సాంకేతిక లోపమా? అనే విషయం తెలాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన తీరును చూస్తే సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం కూడా ఉంది అనే అనుమానాలు తలెత్తున్నాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఒకటి కాదు మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హోప్డా వెళ్తున్న బెంగళూరు హోప్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు మొదట పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన 4 బోగీలు పక్కనున్న ట్రాక్పై బోల్తా పడ్డాయి. దీనికి సాంకేతిక లోపమే కారణమయుంటుందని భావిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయక పోవడమో, ఇంకోటో కారణమయుంటుదని చెబుతున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదం జరిగిన 7నుంచి 10 నిమిషాల్లోనే బెంగళూరు-హోప్డా రైలు బోగీలు పడి ఉన్న ట్రాక్పైకి కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు దూసుకొచ్చి వాటిని ఢీకొట్టింది. దాంతో కోరమండల్ రైలుకు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పాయి. పక్కనున్న ట్రాక్పైన గాల్లోకి ఎగిరి ఒకదానిపైకి మరోకటి ఎక్కాయి. ఇంతలోనే మరో ఘోరం జరిగింది. కోరమండల్ రైలు బోగీలు పడి ఉన్న ట్రాక్పైకి గూడ్సు రైలు దూసుకొచ్చింది. వాటిని ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లింది. దాంతో కోరమండల్ ఎక్స్ప్రెస్లోని ప్రయాణీకులు ఎక్కువగా చనిపోయారు. కళ్లు మూసి తెరిసేలోగా ఒకదాని వెంట ఒకటి ప్రమాదాలు జరగడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపే వందల మంది ప్రణాలు గాల్లో కలిశాయి. అయితే… రైల్వే అధికారి అమితాబ్ శర్మ ఇంకోలా చెబుతున్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్రైలును ఢీకొట్టడంతో దాని బోగీలు పక్కన ఉన్నట్రాక్పై పడ్డాయని, అనంతరం ఆ బోగీలను హోప్డా ఎక్స్ప్రెస్ డీకోట్టడంతో దానికి సంబంధించిన మూడు బోగీలు పట్టాలు తప్పాయని తెలిపారు.
అయితే మొదటి ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగింది అనుకుంటే తరువాత వరుసగా మరో రెండు రైళ్లు ఢికోనడాన్నిమానవ తప్పిదంగానే పలువురు భావిస్తున్నారు. మొదటి ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయుంటే తరువాత రెండు ప్రమాదాలు జరిగి ఉండేవి కాదంటున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ‘కవచ్’ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
‘కవచ్’ అంటే ఏమిటీ.. ఇది ఉంటే భారీ ప్రాణ నష్టం తప్పేదేమో?
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కొన్ని మార్గాల్లో కవచ్ అనే సిస్టమ్ను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. నిన్న జరిగిన మార్గంలో ఈ కవచ్ వ్యవస్థ లేదు. అందుకే ప్రమాద తీవ్రత పెరిగిందనేది వాదన. కవచ్(kavach)అనేది ఒక యాంటీ కొలిజన్ సిస్టమ్. ఇదెలా పని చేస్తుందటే… ఇప్పుడు ఉదాహరణకు ఒక లోకోపైలెట్(రైలు డ్రైవర్) రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా అలాగే రైలును నడిపినపుడు ఈ కవచ్ అనే సిస్టమ్ అటోమేటిగ్గా రైలును అపేస్తుంది. అదేవిధంగా రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినపుడు ప్రమాదం జరగకుండా కవచ్ కాపాడుతుంది.
కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి కారణమా?
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి (Odisha trains accident) కారణం ఏమిటన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి అసలు కారణమని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి ముందు కోరమాండల్ ఎక్స్ప్రెస్ తప్పుడు ట్రాక్లో ప్రయాణించినట్లు రైల్వే సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్ ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తున్నది. శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు బహానగర్ బజార్ స్టేషన్కు ముందు ఉన్న మెయిన్ లైన్కు బదులుగా లూప్ లైన్లో ఆ రైలు ప్రయాణించినట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ఖరగ్పూర్ డివిజన్ సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్కు సంబంధించిన వీడియోల ప్రకారం మూడు రైళ్ల ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్ లైన్లతో సహా నాలుగు రైల్వే ట్రాక్లున్నట్లు తెలుస్తున్నది. గంటకు 127 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆ లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నది. దాని కంపార్ట్మెంట్లు మెయిన్ లైన్పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే ఆ మెయిన్ లైన్లో వస్తున్న యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది.
మరోవైపు సాధారణంగా లూప్ లైన్ 750 మీటర్ల పొడవు ఉంటాయి. గూడ్స్ రైళ్ల కోసం ఎక్కువగా లూప్ లైన్లు వినియోగిస్తారు. బహానగర్ బజార్ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలోని సిగ్నల్ ప్యానెల్ ప్రకారం అక్కడి లూప్ లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. అయితే గూడ్స్ రైలు చివరి బోగీలు మెయిన్ లైన్లో నిలిచి ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 127 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆ గూడ్స్ రైలు బోగీలను ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు.
కాగా, మృతుల సంఖ్య సుమారు 300కు చేరిన మూడు రైళ్లు ఢీకొన్న ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు తప్పుడు ట్రాక్లోకి వెళ్లడం మానవ తప్పిదమేనని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రత్యక్ష సాక్షులు, రైల్వే అధికారుల రిపోర్టు రెండూ భిన్నంగా ఉన్నాయి. గూడ్స్ రైలే కోరమండల్ను ఢీకొట్టిందని అక్కుడున్న జనం చెబుతున్నారు. లేదు… లేదు.. కోరమండల్ రైలే ఆగిఉన్న గూడ్సును ఢీకొట్టిందని రైల్వే అధికారుల ఇచ్చిన ప్రాథమిక నివేధికలో వెల్లడించారు. పూర్తిగా స్ఫష్టత రావాలంటే వేచి చూడాల్సిందే..