భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో స్థానికులు ‘నవ్వుల నిరసన’ నిర్వహించారు. రోడ్డు దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. భోపాల్లోని అరవింద్ విహార్ ప్రాంతంలోని 200 మీటర్ల పొడవైన రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో స్థానికులు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేశారు. అయితే గత రెండేళ్లుగా పనులు చేపట్టలేదు. స్థానికులు నిరసన చేయగా కొన్ని పనులు చేశారు. అనంతరం దాని గురించి పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో రోడ్డు దుస్థితిని మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అరవింద్ విహార్ ప్రాంతం వాసులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. 200 మీటర్ల పొడవైన శిథిలమైన రహదారిపై ‘నవ్వుల నిరసన’ నిర్వహించారు. స్థానికులు రోడ్డు వెంబడి వరుసగా నిలబడి నవ్వుతూ నిరసనలు తెలిపారు.
కాగా, కొన్ని నెలల కిందట కురిసిన భారీ వర్షాలకు నీటి గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై స్థానికులు ఫ్యాషన్ పరేడ్ నిర్వహించి తమ నిరసన తెలిపారు. అయినప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడంతో ఈసారి ‘నవ్వుల నిరసన’ నిర్వహించారు.