న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రపంచ వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. దాదాపు 4 వేల ఏండ్ల కిందట నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రపంచ పర్యాటకులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. వీటిని కొన్ని లక్షల భారీ శిలలతో నిర్మించారు. ఒక్కో శిల కనీసం 2.5 టన్నుల నుంచి 15 టన్నుల వరకు ఉంటుంది. అయితే వీటిని ఏ టెక్నిక్తో నిర్మించారో ఇప్పటికీ అంతుచిక్కని బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది.
ప్రస్తుతం ఉన్న సాంకేతికత కానీ, మెషీన్లు కానీ లేని ఆ సమయంలో అంత బరువున్న రాళ్లను ఎలా మోయగలిగారనేది పెద్ద రహస్యం. అప్పటి ఈజిప్టియన్లు ఈ శిలలను నైలు నది ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారని కొందరు చెబుతున్నారు. తీరా చూస్తే ఈ పిరమిడ్లకు ప్రస్తుతం నైలు నది కనీసం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరీ అన్ని కిలోమీటర్లు అంత బరువున్న రాళ్లను తీసుకురావడం అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే తాజా పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని గుర్తించారు.
అదేంటంటే నైలు నది పాయ ఒకటి అప్పట్లో పిరమిడ్లకు చాలా దగ్గరి నుంచి ప్రవహించి ఉండేదని, ఇప్పుడు అది కనుమరుగైందని చెబుతున్నారు. ఇందుకోసం పిరమిడ్ల చుట్టూ ఉన్న ఎడారి ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఏవైనా నీటి జాతి మొక్కల పరాగరేణువుల ఆనవాళ్లు దొరుకుతాయని పరిశోధించారు. ఇక్కడ నైలు నది పాయ లేకపోతే పిరమిడ్లను నిర్మించడం అసాధ్యమని అధ్యయనం జరిపిన హాడర్ షీష్ పేర్కొన్నారు.