న్యూఢిల్లీ: సహజ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి వెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రేను మూడు, నాలుగు సార్లు అభ్యర్థించినట్లు శివసేన తిరుగుబాటు నేత, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. మహా వికాస్ అఘాడీ (కూటమి)పై అసంతృప్తికి గురైన పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు ముందు ఉద్ధవ్తో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అన్నారు. బీజేపీ మద్దతులో సీఎం అయిన షిండే, రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లారు. మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి బీజేపీ కేంద్ర నేతలను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తోపాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ప్రధాని మోదీతో కూడా వీరిద్దరు సమావేశం కానున్నారు.
కాగా, ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో షిండే మాట్లాడారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలే నిజమైన శివసేన అని పునరుద్ఘాటించారు. తమ సంఖ్య పెద్దదని, అసెంబ్లీ స్పీకర్ కూడా గుర్తించారని అన్నారు. ‘నా వెంట 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే, బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నుంచే సీఎం అవుతారని ప్రజలంతా అనుకున్నారు. చిన్న వ్యక్తి అయిన తనను బీజేపీ సీఎంను చేసింది. అధికారం కోసమే బీజేపీ ఇదంతా చేసిందని ఇప్పుడు ఎవరైనా అనుకుంటారా? ’ అని షిండే ప్రశ్నించారు. బాల్ ఠాక్రే హిందుత్వాన్ని ఉద్ధవ్ నిర్లక్ష్యం చేస్తే, బీజేపీ దానికి మద్దతిచ్చిందని ఆయన అన్నారు.