న్యూఢిల్లీ, ఆగస్టు 23: కులాలవారీగా జనగణన చేపట్టాలన్న డిమాండ్తో బీహార్ సీఎం నితీశ్కుమార్ సారథ్యంలో ఆ రాష్ర్టానికి చెందిన 10 పార్టీల ప్రతినిధుల బృందం సోమవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశాయి. ఈ బృందంలో బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పెద్ద పార్టీల నేతలూ ఉన్నారు. కులగణనపై అన్ని పార్టీలూ ఒక్కటిగా గొంతు వినిపించాయని సమావేశం అనంతరం మీడియాకు నితీశ్ తెలిపారు. కులగణన వల్ల అభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయవచ్చని, ఇప్పటివరకు వివిధ కులాలు వాటి జనాభాకు అనుగుణంగా పథకాల లబ్ధిని పొందలేకపోతున్న విషయాన్ని ప్రస్తావించాయని తెలిపారు. జాతీయ ప్రయోజనాల కోసం కులగణన అవసరమని, అది చారిత్రాత్మక చర్య అవుతుందని బృందంలో భాగమైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చెప్పారు. పేదలు, సమాజంలో అట్టడుగు వర్గాల వారికి మేలు చేకూరుస్తుందన్నారు. జంతువులను, చెట్లను లెక్కపెడుతున్నప్పుడు మనుషులను కూడా లెక్కపెట్టవచ్చని వ్యాఖ్యానించారు. తాము చెప్పినది ప్రధాని ఓపిగ్గా విన్నారని, తాము చెప్పినదాన్ని తిరస్కరించలేదని ఓ ప్రశ్నకు తేజస్వీ బదులిచ్చారు. కులగణన చేపట్టాలన్న ప్రతిపాదన లేదని ఇటీవల రాజ్యసభలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రకటించడాన్ని నితీశ్, తేజస్వీ ప్రస్తావించారు. ఆ ప్రకటన ప్రజల్లో కలకలం రేపిందని నితీశ్ చెప్పారు. కులగణన డిమాండ్పై అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ ఒకేమాటగా ఉండటం విశేషం. అఖిలపక్ష ప్రతినిధి బృందం ప్రధాని కలువాలన్న ప్రతిపాదనను చేసింది తేజస్వీయేనని నితీశ్ కొనియాడారు. దాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధానిని సమయం కోరడంపై నితీశ్కు తేజస్వీ కృతజ్ఞతలు తెలిపారు. కులాలవారీగా జనగణన డిమాండ్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. దానివల్ల ఓబీసీ కోటా పెంచాలన్న తమ డిమాండ్కు బలం పెరుగుతుందని బీజేపీ మిత్రపక్షాలు సహా అన్ని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ డిమాండ్కు బీజేపీకి చెందిన చాలామంది ఓబీసీ నాయకులు మద్దతు ఇస్తున్నప్పటికీ ఆ పార్టీ మాత్రం స్పష్టంగా తన వైఖరిని వెల్లడించలేదు. బీజేపీ హిందుత్వ వ్యూహాన్ని ఎదుర్కొనడానికి కులగణన తమ అస్త్రమవుతుందని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
మోదీ నిర్ణయం శిరోధార్యం: జనక్రామ్
అఖిలపక్ష బృందంలో సభ్యుడైన బీజేపీ నేత జనక్రామ్ మీడియాతో మాట్లాడుతూ మోదీని కుటుంబ సంరక్షకుడిగా అభివర్ణించారు. కులగణన విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ ఆమోదయోగ్యమేనని చెప్పారు. చాలామంది నాయకులు కులమతాల పేరుతో ఎదుగుతారని, తర్వాత తమ కుటుంబాలను మాత్రమే వృద్ధిలోకి తీసుకురావడంలో నిమగ్నమవుతారని వ్యాఖ్యానించారు.