ముంబై : డెల్టా వేరియంట్ వ్యాప్తి, కరోనా వైరస్ మ్యుటేషన్లతో భారత్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం గ్రామీణ ప్రాంతాల నుంచి వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండంటతో మూడో ముప్పు ఆందోళన రేకెత్తిస్తోందని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్ధికవేత్త తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. సెకండ్ వేవ్ కొనసాగుతుండగానే థర్డ్ వేవ్ ముప్పు వెంటాడుతోందని, డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల, వైరస్ మ్యుటేషన్లు థర్డ్ వేవ్ ముప్పుకు సంకేతాలని అన్నారు.
రోజూవారీ నమోదవుతున్న తాజా కేసులను చూస్తే మూడో ముప్పు క్రమంగా ఎదురవనుందని వెల్లడవుతోందని నివేదిక అంచనా వేసింది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం కూడా ఆందోళన రేకెత్తిస్తోందని పేర్కొంది. జూన్లో రోజుకు సగటున 40 లక్షల వ్యాక్సిన్ డోసులు వేయగా జులై 12న ఇది 34 లక్షలకు పడిపోయిందని, వ్యాక్సిన్ల కొరత వెంటాడటం వైరస్ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని నివేదిక తెలిపింది. 18 ఏండ్లు పైబడిన వారిలో కేవలం 22.7 శాతం మంది తొలిడోసు తీసుకోగా కేవలం 5.4 శాతం జనాభానే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుందని నివేదిక పేర్కొంది.