Renuka Chowdhury | న్యూఢిల్లీ : కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న కమ్మ నాయకులకు తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కమ్మ లీడర్లు అంటే అంత లోకువనా..? వారిని అంత తక్కువ అంచనా వేస్తున్నారా..? అని ప్రశ్నించారు. అంటే ఏదో పిల్లికి భిక్షం పెట్టినట్లు నాలుగు బిస్కెట్లు ఏసేస్తే కమ్మ నాయకులు ఊరుకుంటారా..? మీకు సీట్లు, ఆర్థికంగా కూడా చూసుకుంటామని ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. ఆ పని ఎందుకు కాంగ్రెస్ చేయలేకపోతుందని రేణుకా చౌదరి ప్రశ్నించారు.
పార్టీ టికెట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని రేణుకా చౌదరి ఆరోపించారు. మొదటి జాబితాపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలన్నారు రేణుకా చౌదరి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని.. కమ్మ కులాన్ని కూడా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా కమ్మ కులస్తులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. కమ్మ కులస్తుల మనోభావాల్ని పరిగణలో తీసుకోవాలని హైకమాండ్ను కోరినట్లు రేణుకా చౌదరి తెలిపారు. అయితే ఎన్నికల డేట్ దగ్గరికి వచ్చే కొద్దీ కాంగ్రెస్ని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం.. ఈ నేపథ్యంలోనే రేణుక చౌదరి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయటం చర్చనీయాంశం అవుతుంది.