న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు ఆ పార్టీకి చెందిన పలు భవనాలకు అద్దె చెల్లించలేదు. కాంగ్రెస్ పార్టీ ఆస్తుల అద్దె మొత్తం బకాయిలు లక్షల్లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సుజిత్ పటేల్ అనే ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు కోరారు. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనికి బదులిచ్చింది. ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం మొత్తం రూ.12,69,902 అద్దె బకాయి పడిందని తెలిపింది. 2012 డిసెంబర్లో చివరిసారిగా దీనికి అద్దె చెల్లించారని చెప్పింది.
అలాగే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం ఉంటున్న 10 జన్పథ్ రోడ్డులోని బంగ్లాకు రూ.4,610 అద్దె పెండింగ్లో ఉందని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సెప్టెంబర్లో చివరిసారి ఈ బంగ్లాకు అద్దె చెల్లించినట్లు చెప్పింది. సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ నివాసం ఉంటున్న ఢిల్లీ చాణక్యపురిలోని బంగ్లాకు రూ.5,07,911 అద్దె బకాయి ఉన్నదని వివరించింది. 2013 ఆగస్ట్లో చివరిసారి ఈ బంగ్లాకు అద్దె చెల్లించారని ఆ సమాధానంలో పేర్కొంది.
కాగా, హౌసింగ్ నిబంధనల ప్రకారం జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీలో కేటాయించిన స్థలంలో మూడేండ్లలో సొంత కార్యాలయాలు నిర్మించుకోవాలి. అనంతరం వారికి కేటాయించిన ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలి. ఇందులో భాగంగా 2010 జూన్లో ఢిల్లీలోని 9ఏ రూస్ అవెన్యూలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించారు. దీంతో 2013 నాటికి అక్బర్ రోడ్ కార్యాలయంతోపాటు మరికొన్ని బంగ్లాలను కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయాల్సి ఉంది. అయితే ఆ పార్టీ దీనిని పొడిగిస్తూ వస్తున్నది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ లోధి రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నివాసం ఉంటున్న బంగ్లా ఖాళీ కోసం 2020 జూలైలో ప్రభుత్వం నోటీస్ పంపింది. ఒక నెలలో దానిని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నది.
మరోవైపు సోనియా గాంధీ నివాసానికి అద్దె చెల్లించకపోవడాన్ని బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆమె మోసాలు చేయలేకపోతున్నారని, దీంతో అద్దె చెల్లించలేకపోతున్నారని ఆరోపించారు. దీంతో తాను మానవత్వంతో సహాయం చేసేందుకు ‘సోనియా గాంధీ రిలీఫ్ ఫండ్’ పేరుతో ప్రచారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఖాతాకు తన వంతు సాయంగా రూ.10 పంపినట్లు చెప్పారు. దీని స్ర్కీన్ షాట్ను ఆయన షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని కోరుతూ ట్వీట్ చేశారు.