కోల్కతా: సౌరవ్ గంగూలీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆరోపణపై బీజేపీ మండిపడింది. మమతాబెనర్జికి ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు సువేందు అధికారి విమర్శించారు. గంగూలీ మీద అంత అభిమానం ఉంటే.. బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న షారూఖ్ ఖాన్ను తొలగించి, ఆయన స్థానంలో గంగూలీని నియమించుకోవాలని సూచించారు.
ఆటలపైన కూడా మమతాబెనర్జి రాజకీయం చేయడం కరెక్టు కాదని సువేందు ఫైరయ్యారు. గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోడీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని అన్నారు. కాగా, అంతకుముందు మమతాబెనర్జి మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు గంగూలీకి అన్యాయం చేసిందని ఆరోపించారు.
చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి గంగూలీని కేంద్రం ఐసీసీకి పంపించాలని అభ్యర్థించారు. సౌరవ్ గంగూలీ దేశానికి, ప్రత్యేకించి పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి గర్వ కారణమని చెప్పారు.