లఖింపూర్ ఖీరీ, మే 5: లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడం వల్ల చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి రైతులు వచ్చారు. లఖింపూర్కు వచ్చిన వారిలో రైతు నేత రాకేశ్ టికాయిత్ కూడా ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని జిల్లా కలెక్టర్ మహేంద్ర బహదూర్సింగ్ దృష్టికి తీసుకొచ్చారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం ఇస్తానన్న పరిహారాన్ని చెల్లించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 10న లఖింపూర్లో మహాపంచాయత్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని రైతులు డిమాండ్చేశారు. లఖింపూర్ ఘటనలో సాక్ష్యలుగా ఉన్నవారిపై దాడులు జరుగుతుండటాన్ని టికాయిత్ ప్రస్తావించారు. ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు.