Nitish Kumar | విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేయాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కోరారు. దేశ వ్యాప్తంగా తాజాగా కుల గణన జరుపాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా బలహీన పడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
`సుప్రీంకోర్టు సరైన తీర్పు చెప్పింది. మేం ఎల్లవేళలా రిజర్వేషన్ కోటాకు మద్దతుగా ఉన్నాం. 50 శాతం రిజర్వేషన్ పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిమితి వల్ల ఇతర వెనుక బడిన వర్గాలు (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈబీసీ) తమ జనాభా నిష్పత్తి ప్రాతిపదికన అవకాశాలు కోల్పోతున్నారు` అని నితీశ్ చెప్పారు. దేశంలోని వివిధ సామాజిక వర్గాల జనాభాపై తాజా అంచనాలు ఖరారు చేయాలని గతేడాది ప్రధాని నరేంద్రమోదీతో గుర్తు చేసినట్లు తెలిపారు. `కులాలు, సామాజిక వర్గాల వారీగా రాష్ట్రాలు జనాభా గణన చేయగలవు. మేం ఆ ప్రక్రియ చేపట్టాం. కానీ జాతీయ స్థాయిలో చేస్తే ఇంకా బాగుంటుంది` అని నితీశ్ కుమార్ అన్నారు.
నితీశ్ వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. `పేద అగ్రకులాల వారు రిజర్వేషన్ పొందడం పట్ల బీహార్ సీఎంకు అసంతృప్తి ఉన్నట్లు ఉంది. ఆయన ప్రస్తుత మిత్రపక్షం ఆర్జేడీ భాష వాడుతున్నారు` అని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ చెప్పారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీహార్లో రిజర్వేషన్ల పరిమితి ఎత్తేయడం అవసరమైతే, మీరు (నితీశ్) ఆ పరిమితి ఎత్తేయాలని కోరుకుంటే మేం స్వాగతిస్తాం` అని అన్నారు. గమ్మత్తేమిటంటే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో తొలుత డిమాండ్ చేశారు.