చెన్నై: పెళ్లి సమయంలో భర్త కట్టిన తాళి (మంగళసూత్రం)ని భార్య తీసేయడం, భర్తను మానసికంగా అత్యంత క్రూరంగా హింసించడమేనని మద్రాస్ హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు తీర్పుపై అపీల్ చేసిన భర్తకు విడాకులు మంజూరు చేసింది. తమిళనాడుకు చెందిన సీ శివకుమార్కు 2008 నవంబర్లో ఒక మహిళతో పెళ్లి అయ్యింది. ప్రస్తుతం ఈరోడ్లోని ఒక వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు.
అయితే 2011 నుంచి భార్యాభర్తలు విడిగా జీవిస్తున్నారు. దీంతో విడాకుల కోసం శివకుమార్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. 2011 నుంచి తాము విడిగా జీవిన్నామని, పెళ్లినాడు తాను కట్టిన మంగళసూత్రాన్ని భార్య తీసివేసిందని ఆరోపించాడు. అయితే తాళిని బ్యాంకు లాకర్లో ఉంచినట్లు ఆమె తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. హిందూ వివాహ చట్టం సెక్షన్ 7 కింద మంగళసూత్రం కట్టడం తప్పనిసరి కాదని, అందువల్ల భార్య ఒకవేళ భర్త కట్టిన తాళిని తీసివేసినా ఆ వివాహ బంధంపై ఎలాంటి ప్రభావం చూపదని వాదించాడు. దీనిని సమర్థించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ 2016 జూన్ 15న తీర్పు ఇచ్చింది.
కాగా, ఫ్యామిలీ కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టులో శివకుమార్ సవాల్ చేశాడు. న్యాయమూర్తులు వీఎం వేలుమణి, ఎస్ సౌంథర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా భర్త కట్టిన మంగళసూత్రాన్ని భార్య తీసేయడాన్ని కోర్టు ఆక్షేపించింది. భర్తను మానసికంగా అత్యంత క్రూరంగా హింసించడమేనని తెలిపింది. ‘స్త్రీ మెడలో తాళి అనేది పవిత్రమైన విషయం. ఇది వైవాహిక జీవితం కొనసాగింపును సూచిస్తుంది. భర్త మరణించిన తర్వాత మాత్రమే ఆ తాళిని తొలగిస్తారు. కాబట్టి భార్య దానిని తొలగించడం భర్తపై అత్యున్నత క్రూరమైన చర్యగా చెప్పవచ్చు. భర్తకు ఇది బాధను కలిగించడంతోపాటు అతడి మనోభావాలను దెబ్బతీస్తుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే భార్య కేవలం తాళిని తీసేసినంత మాత్రాన ఆ వివాహ బంధం ముగిసినట్లుగా చెప్పడం తమ ఉద్దేశం కాదని కోర్టు తెలిపింది. ఈ చర్యతోపాటు భార్యకు సంబంధించిన మిగతా ఆధారాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పింది. భర్తపై అనుమానంతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించిన భార్య, ఆయనకు మానసికమైన క్రూరత్వం కలిగించిందని కోర్టు పేర్కొంది.
ఈ ఆధారాలు, పరిణామాలను పరిశీలించిన తర్వాత వివాహ బంధాన్ని పునరుద్ధరించటానికి, కొనసాగించడానికి పార్టీలకు ఎటువంటి ఉద్దేశం లేదన్న ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చామని కోర్టు అభిప్రాయపడింది. ‘వివాహాన్ని రద్దు చేస్తూ డిక్రీని మంజూరు చేయడం ద్వారా వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మేం ప్రతిపాదిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. దిగువ కోర్టు తీర్పును పక్కనపెట్టి, విడాకులు మంజూరు చేసింది.