న్యూఢిల్లీ, జూన్ 26: ‘ఆదివారమైనా, సోమవారమైనా మీరు మాత్రం ప్రతి రోజూ కోడి గుడ్డును తప్పక తినండి’ అంటూ అధిక పోషకాహార విలువలున్న కోడి గుడ్డును తినడంపై ప్రచారం చేస్తున్న కేంద్రం వాస్తవానికి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల్లో హాజరు శాతం పెంచి, విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో వడ్డిస్తున్న కోడి గుడ్డును బీజేపీ పాలిత రాష్ర్టాల్లో క్రమేపీ తొలగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బెంగాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ కోల్కతాలో పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం బాధ్యతను ఇస్కాన్ సంస్థకు అప్పగించింది. దీంతో ఈ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఇకపై పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్లను అందజేయరని ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్రంలో శాకాహార విధానం అమలుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టీఎంసీ సంయుక్త కార్యదర్శి డెరెక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. దేశంలోని 28 రాష్ర్టాల్లో 14 రాష్ర్టాల్లో ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్లను అందజేస్తున్నారు. ఇందులో బీజేపీ పాలిత ఐదు రాష్ర్టాలైన అస్సాం, ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో ఈ గుడ్డు అందజేతకు స్థిరంగా అమల్లో ఉంది. కేరళ, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం వంటి బీజేపీయేతర పాలిత రాష్ర్టాలతో పోలిస్తే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నది.
అయితే ఛత్తీస్గఢ్, గోవా, మహారాష్ట్రలలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజనం పథకంలో గుడ్డును ఎత్తివేశాయి. మహారాష్ట్రలో రాష్ట్రం సమకూర్చిన నిధులతో అమలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో పార్టీలతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.