వాషింగ్టన్, ఏప్రిల్ 26: అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛా కమిషన్ భారత్ను విశేషించి ఆందోళన కలిగిస్తున్న దేశంగా ప్రకటించాలని వరుసగా మూడో ఏడాది సిఫార్సు చేసింది. ఈ తరహా వర్గీకరణలోకి వెళ్లిన 15 దేశాల్లో భారత్ చేరడం గమనార్హం. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. కమిషన్ సోమవారం 2022 వార్షిక నివేదికను విడుదల చేసింది. 2021లో భారత్లో పరిస్థితులు మరింతగా దిగజారాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.
ముస్లిం, క్రైస్తవ తదితర అల్పసంఖ్యాక వర్గాలపై దుష్ప్రభావం చూపే హిందూ జాతీయవాద ఎజెండాను భారత్ సర్కారు అమలులోకి తెచ్చిందని విమర్శించారు. నరేంద్రమోదీ సర్కారు నిరసన స్వరాలను నొక్కేస్తున్నదని, యూఏపీఏ వంటి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులు అనుమతిస్తున్నారని, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ధార్మిక కార్యకలాపాలు చేపట్టే స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఎత్తిచూపారు. ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో మరణించడాన్ని ప్రస్తావించారు. గత ఏడాది ఇదే తరహా నివేదిక విడుదలైనప్పుడు ఇండియా అమెరికాకు తీవ్ర నిరసన తెలిపింది.