ముంబై: మహారాష్ట్రలోని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టు ఊరట ఇచ్చింది. ముంబైలోని అంధేరీ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆ వర్గం అభ్యర్థిని రితుజా లట్కే రాజీనామాను ఆమోదించాలని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)ని గురువారం ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. నామినేషన్ దాఖలు గడువుకు ఒక్క రోజు ముందు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
నవంబర్ 3న జరుగనున్న అంధేరి ఈస్ట్ నియోజకవర్గం ఉపఎన్నిక శివసేన రెండు వర్గాల మధ్య పోరుగా నిలిచింది. శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ లట్కే కొన్ని నెలల కిందట మరణించారు. దీంతో అంధేరిలో ఈస్ట్లో ఉప ఎన్నికకు దారి తీసింది. ఆయన భార్య రితుజా లట్కేను అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై కార్పోషన్ (బీఎంసీ)లో పని చేస్తున్న ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
మరోవైపు బీజేపీ మద్దతుతో సీఎం అయిన శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వర్గం దీనిని అడ్డుకుంటున్నది. రితుజా లట్కేపై ఒత్తిడి తెస్తున్నది. తమ తరుఫున పోటీ చేయాలని బేరసారాలు చేస్తున్నది. ఇందులో భాగంగా రితుజా రాజీనామాను బీఎంసీ ఆమోదించలేదు.
కాగా, శుక్రవారంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈలోపు రితుజా రాజీనామాను బీఎంసీ ఆమోదించకపోతే ఉద్ధవ్ వర్గం అభ్యర్థిగా ఆమె పోటీ చేయడం కుదరదు. ఈ నేపథ్యంలో తన రాజీనామాను బీఎంసీ త్వరగా ఆమోదించాలని కోరుతూ బాంబే హైకోర్టును రితుజా ఆశ్రయించారు. ఆ పిటిషన్పై గురువారం విచారణ జరిపిన కోర్టు ఆమెకు మద్దతుగా తీర్పు ఇచ్చింది.