అహ్మదాబాద్ : బిల్కిస్ బానో లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గోద్రా సబ్జైలు నుంచి విడుదలైన దోషులను వీహెచ్పీ కార్యాలయంలో దండలతో సత్కరించారు. 2002 గోద్రా అల్లర్లలో బిల్కీస్ బానో అనే గర్భిణిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆమె కుటుంబసభ్యులు ఏడుగురిని హతమార్చిన కేసులో వీరు దోషులుగా తేలారు.
గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా గోద్రా సబ్జైలు నుంచి విడుదలయ్యారు. రాధేశ్యాం షా, జస్వంత్ చతుర్భాయ్ నాయ్, కేశూభాయ్ వదనియ, బకభాయ్ వదనియ, రాజిభయ్ సోని, రమేష్భాయ్ చౌహాన్, శైలేష్భాయ్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్ భాయ్, మితేష్ భట్, ప్రదీప్ మొదియ సోమవారం జైలు నుంచి బయటకు వచ్చారు.
కాగా, బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేసిన కేసులో ముంబై సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం పదకొందు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. వీరికి విధించిన శిక్షను ఆపై బాంబే హైకోర్టు సమర్ధించింది. వీరంతా 15 ఏండ్లు పైగా జైలు శిక్ష అనుభవించగా ఖైదీల్లో ఒకరు తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్ధానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.