న్యూఢిల్లీ/జెనీవా, అక్టోబర్ 6: దగ్గు మందులతో ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది పిల్లలు మృతిచెందటంతో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) అప్రమత్తమైంది. ఆ మరణాలపై విచారణ ప్రారంభించింది. హర్యానాలోని ఓ కంపెనీ తయారు చేసిన 4 రకాల దగ్గు మందులను వాడటం వల్లే గాంబియాలో చిన్నారులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొన్నది. ఇదే విషయాన్ని డీసీజీఏ దృష్టికి కూడా తీసుకొచ్చింది. దీంతో స్పందించిన డీసీజీఏ.. భారత్లో తయారైన దగ్గు మందుల వల్లే చిన్నారులు మరణించారనడానికి ఆధారాలు సమర్పించాలని డబ్ల్యూహెచ్వోకు సూచించింది. మరోవైపు హర్యానా ప్రభుత్వం ఈ నాలుగు రకాల దగ్గు మందుల శాంపిల్స్ను సేకరించింది. వీటిని కోల్కతాలోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీకి పంపింది. వీటిని పరీక్షించి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది.
ఈ నాలుగు రకాల దగ్గు మందుల ఎగుమతికి అనుమతి ఉన్నదని, అయితే భారత్లో అమ్మకం, మార్కెటింగ్కు అవి అందుబాటులో లేవని డీసీజీఏ వెల్లడించింది. మందులపై డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మాట్లాడుతూ ‘భారత్లో తయారైన దగ్గు మందుల వల్లనే గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించినట్టు అనుమానాలున్నాయి. దీనిపై దర్యాప్తు జరుపుతున్నాం. భారత్కు చెందిన డీసీజీఏతోనూ కలిసి పనిచేస్తున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతానికి ఆ మందులను గాంబియాలోనే గుర్తించామని, ఇతర దేశాలకూ సరఫరా అయ్యి ఉండొచ్చన్నారు.