ఇరవయ్యో శతాబ్దపు విధానాలు
నేటి అవసరాలను తీర్చలేవు: మోదీ
అహ్మదాబాద్, జూలై 16: ఇరవయ్యో శతాబ్దపు ఆలోచనలు, విధానాలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేవని ప్రధాని మోదీ అన్నారు. రైల్వేలో సంస్కరణలు అత్యావశ్యకమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్లోని గాంధీనగర్ క్యాపిటల్ రైల్వేస్టేషన్, వడ్నగర్ రైల్వే స్టేషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ రెండు రైల్వే స్టేషన్లను ఇటీవలే ఆధునీకరించారు. వడ్నగర్ రైల్వే స్టేషన్లోనే ప్రధాని మోదీ తండ్రి టీ అమ్మారు. మోదీ ఆయనకు సహాయపడేవారు. గాంధీ నగర్ నుంచి ప్రతీవారం వారణాసి వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. స్టేషన్పై భాగంలో రూ.790 కోట్లతో నిర్మించిన ఫైవ్ స్టార్ హోటల్ను ప్రారంభిస్తూ.. ‘భారత రైల్వే కొత్త అవతారానికి ఈ హోటల్ ఒక ట్రైలర్’ అని అభివర్ణించారు. శ్రీనగర్ను, కన్యాకుమారిని త్వరలోనే రైల్వే మార్గంతో కలుపుతామన్నారు. వీటితో పాటు ప్రధాని అహ్మదాబాద్లోని ఆక్వాటిక్ గ్యాలరీ, రొబోటిక్ గ్యాలరీ, నేచర్ పార్కులను ప్రారంభించారు.