Manish Tiwari on Agnipath | సైనిక బలగాల్లో కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వివిధ వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ కేంద్రం నిర్ణయం సరైందేనన్నారు. సైన్యంలో కేంద్ర ప్రభుత్వం సరైన దిశగా సంస్కరణ తీసుకొస్తున్నదని ఓ వార్తా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు అగ్నిపథ్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్రంగా విమర్శించగా, ఆ పార్టీ నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. పార్టీ వైఖరికి భిన్నంగా మనీశ్ తివారీ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఈ రోజున మొబైల్ ఆర్మీ, యువ రక్తంతో కూడిన ఆర్మీ మీకు కావాలి. ఆయుధాలు, టెక్నాలజీ వినియోగంపై మరింత అనుభవజ్ఞులు మీకు అవసరం. ఒకవేళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోకపోతే భారీగా నగదు కోల్పోవాల్సి వస్తుందన్నారు. దశాబ్ధాల తరబడి కొనసాగిస్తున్న వార్పేర్ సంప్రదాయంలో మార్పు రావాల్సి ఉందన్నారు.
30 ఏండ్ల క్రితం సైనిక బలగాలంటే అత్యంత ఖర్చుతో కూడిన బలగాలు.. కానీ అత్యాధునిక టెక్నాలజీ రావడంతో యువతరానికి పెద్ద పీట వేయాల్సి ఉంది. ఈ తరుణంలో సైనిక నియామకాల్లో తీసుకురావాల్సిన సంస్కరణ ఇది అని మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు.