న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కు చెందిన పాఠ్యపుస్తకంలో తాజాగా దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ( Maulana Abul Kalam Azad) ప్రస్తావనను తొలగించారు. 11వ తరగతి రాజకీయ శాస్త్రం పాఠ్యపుస్తకంలోని మొదటి అధ్యాయంలో ‘రాజ్యాంగం-ఎందుకు, ఎలా’ అన్న పాఠ్యాంశంలో రాజ్యాంగ అసెంబ్లీ కమిటీ సమావేశాల నుంచి మౌలానా ఆజాద్ పేరును తొలగించేందుకు ఒక లైన్ను సవరించారు. ‘సాధారణంగా జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్ లేదా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలకు అధ్యక్షత వహించేవారు’ అని తాజాగా మార్చారు. గతంలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరును తొలగించారు.
కాగా, 1946 లో రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత కొత్త రాజ్యాంగ పరిషత్ ఎన్నికలకు నాయకత్వం వహించిన కాంగ్రెస్లో ఆజాద్ కీలక పాత్ర పోషించారు. నాడు ఆరో సంవత్సరం కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన బ్రిటీష్ క్యాబినెట్ మిషన్తో చర్చలు జరిపే ప్రతినిధి బృందానికి కూడా నాయకత్వం వహించారు.
మరోవైపు అదే పాఠ్యపుస్తకం నుంచి జమ్ముకశ్మీర్కు సంబంధించిన అంశాలను కూడా తొలగించారు. ‘ది ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్’ అన్న పదో చాప్టర్లో జమ్ముకశ్మీర్ ప్రాంతం షరతులతో భారత్లో కలిసిందన్న లైన్ను తొలగించారు. ‘ఉదాహరణకు జమ్ముకశ్మీర్ భారత యూనియన్లో చేరడం అన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం దాని స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలనే నిబద్ధతపై ఆధారపడింది’ అని తాజాగా మార్చారు.
కాగా, 2019 ఆగస్ట్లో జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను ఆపాదించిన ఆర్టికల్ 370ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే అదే ఏడాది అక్టోబర్లో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
Also Read: