ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కేంద్రం పంపిన ‘అమెజాన్ పార్శిల్’ అని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. ఛత్రపతి శివాజీపై విమర్శలు చేసిన గవర్నర్ను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోష్యారీని తొలగించకపోతే నిరసనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, గత వారం ఔరంగాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘పాత తరం’ చిహ్నం అని అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఉద్ధవ్ ఠాక్రే గురువారం దీనిపై స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వం అమెజాన్ ద్వారా మహారాష్ట్రకు పంపిన పార్శిల్ ఈ గవర్నర్. కేంద్రం ఆయనను రీకాల్ చేయాలి. లేకపోతే రెండు మూడు రోజుల్లో మేం కార్యాచరణను నిర్ణయిస్తాం. మహారాష్ట్ర బంద్కు కూడా పిలుపు ఇస్తాం. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మహారాష్ట్రను ప్రేమించే బీజేపీ నేతలు కూడా మాతో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.
మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కూడా మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలను గురువారం ఖండించారు. ఆయన అన్ని పరిమితులను అధిగమించారని విమర్శించారు.