చండీగఢ్, ఆగస్టు 24: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య ఆధిపత్య పోరు తీవ్రతరమైంది. తాజాగా అమరీందర్పై నలుగురు క్యాబినెట్ మంత్రులు, పాతిక మంది వరకు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. అమరీందర్ను మార్చాలని డిమాండ్ చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన అమరీందర్పై తమకు విశ్వాసం లేదని వారు ప్రకటించారు. వారంతా మంగళవారం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామని ఆ నలుగురు మంత్రుల్లో ఒకరైన టీ రాజీందర్ సింగ్ బజ్వా మీడియాకు తెలిపారు. ఇందుకు ఒక ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని ఎన్నుకున్నారు. అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని, అవసరమైతే సీఎంను మార్చాలని జజ్వా వ్యాఖ్యానించారు. సిక్కుల పవిత్ర గ్రంథం శ్రీగురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసిన కేసులో ఇప్పటికీ న్యాయం జరుగకపోవడం, డ్రగ్ రాకెట్స్లో పెద్దచేపను అరెస్ట్ చేయకపోవటం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను రద్దు కాకపోవటంపై అసమ్మతి మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశాలపై అమరీందర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు గుర్తుచేస్తున్నారు. మరోవైపు, అమరీందర్కు విధేయులైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధూపై విరుచుకుపడుతున్నారు. పాకిస్థాన్, కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారులు ఇద్దర్ని తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.