Eknath Shinde | తమ గ్రూప్కు ఏ శక్తిమంతమైన జాతీయ పార్టీ మద్దతు లేదని శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శుక్రవారం చెప్పారు. బీజేపీ తమకు మద్దతు ఇస్తుందా? అన్న ఒక టీవీ చానెల్ ప్రశ్నపై ఏక్నాథ్ షిండే సమాధానమిస్తూ.. మా వెనుక పెద్ద శక్తి ఉందని చెప్పడానికి కారణం. బాలా సాహెబ్ బాల్ఠాక్రే, అనంద్ దిఘే దీవెనలు మాకు ఉన్నాయని అర్థం అని చెప్పారు.
గురువారం తమకు శక్తిమంతమైన జాతీయ పార్టీ మద్దతు ఇస్తున్నదని ఏక్నాథ్ షిండే చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, 24 గంటల వ్యవధిలోనే షిండే మాట మార్చడం గమనార్హం.
మరోవైపు, మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకుంటున్నది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసేందుకు.. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు పొందేందుకు ఏక్నాథ్ షిండేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లభించిందని తెలుస్తున్నది.
ఏక్నాథ్ షిండేతోపాటు అసోం రాజధాని గువాహటిలో క్యాంప్ వేసిన 37 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్కు లేఖ రాశారు. తమ గ్రూప్ నేతగా ఏక్నాథ్ షిండే నియమించుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో మహా వికాస్ అఘాడీ కూటమి సర్కార్కు ఏక్నాథ్ షిండే గ్రూప్ మద్దతు ఉపసంహరించనున్నదని తెలుస్తున్నది. ఈ విషయమై మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీకి ఏక్నాథ్ షిండే లేఖ రాయనున్నారని సమాచారం.