న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం అమలు చేస్తున్న ‘అగ్నివీర్’ పథకంలో అవసరమైతే మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అగ్నివీరుల భవిష్యత్తు భద్రంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ‘టైమ్స్ నౌ సమ్మిట్’లో ఆయన మాట్లాడుతూ, రక్షణ దళాల్లో యవ్వనం, జవసత్వాలు గలవారు ఉండాలన్నారు.
యువత చాలా ఉత్సాహంగా ఉంటారని, వారు సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆకళింపు చేసుకుని, పని చేస్తారని చెప్పారు. ‘అగ్నిపథ్’ లేదా ‘అగ్నివీర్’ పథకం ద్వారా సైన్యం, నావికా దళం, వాయు సేనల కోసం నియామకాలు జరుగుతాయి. ఎంపికైనవారు నాలుగేళ్లపాటు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులవుతారు. ఈ నాలుగేళ్లలో ఆరు నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఈ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత సాయుధ దళాల్లో కొనసాగడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.