బెంగళూరు: చంద్రుడిపై స్లీప్ మోడ్లో ఉన్న చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్, రోవర్ ప్రజ్ఞాన్ను పునరుద్ధరించే ప్రణాళికలను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. తొలుత శుక్రవారం సాయంత్రం ల్యాండర్, రోవర్ను తిరిగి యాక్టివేట్ చేయాలని భావించినట్లు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల దీనిని సెప్టెంబర్ 23న చేపడతామని చెప్పారు.
కాగా, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్ ప్రాజెక్ట్ చంద్రయాన్-3 విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన రోవర్ సుమారు 105 మీటర్ల దూరం వరకు కదిలింది.
మరోవైపు చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభం కావడంతో సెప్టెంబర్ 2న రోవర్ను, 4న ల్యాండర్ను స్లీప్ మోడ్లో ఇస్రో ఉంచింది. అయితే శుక్రవారం నుంచి చంద్రుడిపై తిరిగి లూనార్ డే ప్రారంభమైంది. దీంతో నిద్రావస్థలో ఉన్న ల్యాండర్, రోవర్ను తిరిగి యాక్టివ్ చేసే చర్యలను శనివారానికి ఇస్రో వాయిదా వేసింది.
కాగా, లూనార్ నైట్ సందర్భంగా చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉండే మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఇవి తిరిగి పని చేస్తాయా అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి పని చేస్తే భారత్ మరో చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.