Cogress G-23 | 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పటిష్ట కార్యాచరణ చేపట్టాలని కాంగ్రెస్ అసమ్మతి నేతల సమావేశం తీర్మానించింది. పార్టీలో అందరినీ కలుపుకు పోవాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తూ 18 మంది నేతల సంతకాలతో ఓ ప్రకటన విడుదలైంది. కాంగ్రెస్ అధిష్టానం తమను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు (జీ-23) బుధవారం రాత్రి గులాం నబీ ఆజాద్ ఇంట్లో సమావేశమయ్యారు.
ఇప్పటికైనా బీజేపీతో పోరుకు కలిసి వచ్చే పార్టీలతో చర్చలు ప్రారంభించాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. అన్ని స్థాయిల్లో సమగ్ర, సమిష్టి నాయకత్వ విధానాన్ని బలపర్చాలని కోరింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు సూచించేందుకు పార్టీ నేతలను నియమించాలని సిఫారసు చేసింది.
ఈ సమావేశానికి సీనియర్ నేతలు కపిల్ సిబాల్, మనీశ్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, ఆనంద్ శర్మ, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, రాజ్బబ్బర్, పీజే కురియన్, మణి శంకర్ అయ్యర్ హాజరయ్యారు. అనూహ్యంగా తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ హాజరు కావడం గమనార్హం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత కపిల్ సిబల్ వ్యాఖ్యలు పార్టీలో కాక రేపాయి.