చండీగఢ్: రేపు కర్తార్పూర్ కారిడార్ను పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్వాగతించారు. కారిడార్ పునఃప్రారంభం గురునానక్ దేవ్ భక్తులకు అమూల్యమైన బహుమానం అని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర సర్కారు గత మార్చి 16 నుంచి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను మూసివేయించింది.
ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోవడంతో నవంబర్ 17 నుంచి పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, కర్తార్పూర్ కారిడార్ను పునఃప్రారంభించాలని ఇటీవల పంజాబ్ సర్కారు నుంచి, ఆ రాష్ట్రంలోని వివిధ పార్టీలు, సంఘాల నుంచి కేంద్రానికి అభ్యర్థనలు వెళ్లాయి. పంజాబ్ సీఎం చరణ్జీత్సింగ్ చన్నీ స్వయంగా ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కలిసి కూడా విజ్ఞప్తి చేశారు.