(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సామాన్యుడికి రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు.. రూ.కోట్లు ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్లను మాత్రం ఏం చేయట్లేదు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి కొందరు పేర్లే మనకు తెలుసు. ఏకంగా 2,278 మంది బడా ఆర్థిక నేరగాళ్లు ఇదే కోవలో ఉన్నారని తెలుసా? వీరు దాదాపు రూ.1,84,863 కోట్లు ఎగ్గొట్టారు. వీరిలో 312 మంది పేర్లను ఆర్బీఐ వెల్లడించడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల్లో ఈ 312 మంది బడాబాబులు ఎగవేసింది 76 శాతం. దాని మొత్తం విలువ రూ.1,41,583 కోట్లు. బ్యాంకుల ఎగవేతదారుల్లో కొందరి పేర్లు, వ్యక్తిగత వివరాలను ఇవ్వలేమని ఆర్బీఐ సమాధానం చెప్పి దొంగలకు సద్దికట్టే ప్రయత్నం చేస్తున్నది. సీబీఐ, ఈడీ లాంటి సంస్థలతో పాటు ఆర్బీఐని కూడా కేంద్రంలోని బీజేపీ తన గుప్పిట్లో ఉంచుకొన్నదని ఈ ఘటనతో స్పష్టమౌతున్నది. ఉద్దేశపూర్వకంగా లోన్లు ఎగ్గొట్టిన బడాబాబుల వివరాలు ఇవ్వాలని పుణె ఆర్టీఐ కార్యకర్త వివేక్ వేలంకర్ కోరగా.. 100 కోట్లకు పైబడి ఎగవేసిన 312 మంది పేర్లు వెల్లడించబోమని పేర్కొన్నది.
ఆర్బీఐ ఎవరికి కొమ్ము కాస్తున్నది?
ఆర్బీఐ వెల్లడించిన వివరాల్లో 41 మంది బ్యాంకులకు బాకీనే లేరు. బడాబాబుల పేర్లను గోప్యంగా ఉంచిన ఆర్బీఐ.. ఎలాంటి బకాయి లేకపోయినా ఎగవేతదారుల లిస్టులో కొందరి పేర్లను చేర్చి వాళ్లను వీధికీడ్చింది. తనకు తెలిసిన 11 మంది బడా పారిశ్రామికవేత్తలు రెండు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని, ఎగవేతదారులని తెలిసినా వారికి ప్రభుత్వ బ్యాంకులు ఎలా రుణాలు జారీ చేశాయో అర్థం కాలేదని వివేక్ వాపోయారు. ఈ నేరాలను ఆర్బీఐ ఎందుకు నిరోధించలేకపోతున్నదని ప్రశ్నించారు. సామాన్యులకు రుణాలివ్వాలంటే గ్యారంటీలను అడిగే బ్యాంకులు, పెద్ద మొత్తంలో బడాబాబులకు రుణాలు ఇవ్వడంలో ఎందుకు నిబంధనలు ఆచరించటం లేదని ప్రశ్నించారు.
మోదీకి కనిపిస్తలేరా?
నల్లధనాన్ని వెలికి తీస్తానని పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీకి ఎగవేతదారులు ఎందుకు కనిపించరు? అని సామాన్యులు నిలదీస్తున్నారు. బ్యాంకుల ముందు బారులు తీరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, పెద్ద నోట్ల రద్దుతో ఒక్క ఆర్థిక నేరగాన్నీ పట్టుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తున్న కేంద్రం.. ఉద్దేశపూరిత రుణ ఎగవేతదారుల పట్ల ఉదారంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆర్బీఐ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థ రుణ ఎగవేతదారుల పేర్లు బయటపెట్టకపోవటం వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న వాదనకు బలం చేకూరుస్తున్నది.