RBI | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: రిజర్వ్బ్యాంక్ వద్దనున్న భారీ నగదు నిల్వల్ని ఇవ్వాలంటూ 2018లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సంచలన వాస్తవాన్ని వెల్లడించారు. 2019లో జరిగే ఎన్నికల ఖర్చుల కోసం రూ.2-3 లక్షల కోట్ల నిల్వల్ని ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి ఖజానాకు బదిలీ చేయాలన్న కేంద్రం డిమాండ్ను తాము తిరస్కరించామని ఆచార్య తెలిపారు. ఈ అంశంపై తలెత్తిన వివాదంతోనే అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారన్నారు. విరాల్ రాసిన ‘భారత్లో ఆర్థిక స్థిరత్వ పునరుద్దరణ కోసం తపన’ పుస్తకంలోని ముందుమాటలో కేంద్రం, ఆర్బీఐల మధ్య ఏర్పడిన ఘర్షణకు దారితీసిన అంశాల్ని విశదీకరించారు. ‘గత ప్రభుత్వాల హయాంలో ఆర్బీఐ జమచేసుకున్న నిల్వల్లో గణనీయమైన మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం (నరేంద్ర మోదీ సర్కార్) ఖాతాలోకి బదిలీ చేసే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం, దానిలోని ఉన్నతాధికారుల సృజనాత్మక మేధస్సులు రూపొందించాయి’ అంటూ ఆచార్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్ర బ్యాంక్ల స్వయం ప్రతిపత్తిని తక్కువచేసే ఏ ప్రభుత్వమైనా ఫైనాన్షియల్ మార్కెట్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని, ఆర్థిక వెతల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎకానమిక్స్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్న విరాల్ ఆచార్య 2019 జూన్లో పదవీ కాలానికి ఆరు నెలల ముందే ఆర్బీఐ నుంచి వైదొలిగారు.
తమ నిల్వల్ని భారీ మొత్తంలో డిమాండ్ చేయడమంటే..కేంద్ర ప్రభుత్వం వద్ద భారీగా పెరిగిన ద్రవ్యలోటును దొడ్డిదారిన రిజర్వ్బ్యాంక్తో పూడ్పించే చర్యే అని విరాల్ ఆచార్య ఘాటుగా విమర్శించారు. ‘ఎన్నికల సంవత్సరంలో ప్రజాకర్షక వ్యయాల్ని ఎందుకు తగ్గించాలి?…రిజర్వ్బ్యాంక్ బ్యాలెన్స్ షీట్పై దాడి చేసి, పెరుగుతున్న ద్రవ్యలోటును పూడ్చుకుంటే సరి’ అన్నది కేంద్రం ఆలోచనగా ఆర్బీఐ ఉన్నతాధికారి వివరించారు.
ఆర్బీఐపై ఒత్తిడి పెట్టడానికి మరో కారణం కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ఆదాయం సమీకరించడంలో విఫలం కావడం. ఈ ఆదాయంలో ఏర్పడిన కొరతను ఆర్బీఐ నుంచి నగదును బదిలీ చేయించుకోవడం ఇప్పుడు షరా మామూలు అయిపోయింది’ అని విరాల్ ఆచార్య వాపోయారు.
భారీ మొత్తాన్ని బదిలీ చేయాలనే వినతిని ఆర్బీఐ పాటించకపోతే, రిజర్వుబ్యాంక్ చట్టంలోని సెక్షన్ 7ను (అవసరమైన పరిస్థితుల్లో ఆర్బీఐని ఆదేశించడం) ఉపయోగించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధంగా పెట్టుకుంది. ఈ సెక్షన్ను అనూహ్యంగా ఎక్కుపెట్టడం 80 ఏండ్ల ఆర్బీఐ చరిత్రలో తొలిసారి. అప్పటికే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలు చూపుతూ తన పదవీకాలం మరో 9 నెలలు ఉండగానే రాజీనామా చేశారు. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై ఏర్పడిన ఒత్తిడుల కారణంగానే ఆయన వైదొలిగారని వార్తలు వెలువడ్డాయి. ఇటువంటి అంశాలపై (సెక్షన్ 7ను ప్రయోగించడం) తెరచాటున మంతనాలు జరిపేకంటే బహిరంగంగా చర్చించాలని విరాల్ ఆచార్య వాదించారు. ఉదాహరణకు 2020లో కొవిడ్ సమయంలో ఆర్బీఐ నుంచి ఇటువంటి బదిలీలు కోరడం సబబు అవుతుందని ఉదహరించారు.
కేంద్రం, ఆర్బీఐ మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో కేంద్ర బ్యాంక్ వద్ద ఎంతమేరకు నిల్వలు ఉండాలన్న అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమాల్ జలాన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు 2019లో ప్రభుత్వ ఖజానాకు భారీగా రూ.1.79 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.87,400 కోట్లు కేంద్రానికి ఆర్బీఐ చెల్లించింది. అంతక్రితం ఏడాది రూ.30,300 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమచేసింది.
ప్రతీ ఏడాది ఆర్బీఐ లాభాన్నంతటినీ ప్రభుత్వానికి బదిలీ చేయకుండా, కొంతభాగాన్ని తన నిల్వల్లో చేర్చుకుంటుంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు మూడేళ్లపాటు లాభాల్లో రికార్డుస్థాయి మొత్తాలను ప్రభుత్వానికి కేంద్ర బ్యాంక్ బదిలీ చేసిందని మాజీ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. డీమానిటైజేషన్ సంవత్సరంలో కరెన్సీ ముద్రణ కోసం అయిన వ్యయాల కారణంగా కేంద్రానికి తక్కువ బదిలీ జరిగిందని, దీంతో 2019 ఎన్నికల ముందు ప్రభుత్వం తన డిమాండ్ను ‘తీవ్రతరం’ చేసిందని ఆచార్య వివరించారు.