లక్నో, ఆగస్టు 28: యూపీలో సర్కారు దవాఖానల్లో వసతులు లేక పసికందులు చనిపోతున్న ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నా.. ప్రభుత్వం మేల్కొనడం లేదు. మైనర్లపై లైంగికదాడులు జరుగుతున్నా కండ్లు తెరవట్లేదు. తాజాగా ఓ దవాఖానలో ఎలుకలు కొరకడంతో ఓ పసికందు చనిపోయాడు. ఇంకోచోట అప్పుడే పుట్టిన ఇద్దరు ఆడ శిశువులు చెరువు లో విగతజీవులుగా తేలారు. మరో రెండు చోట్ల మైనర్లపై లైంగికదాడులు జరిగాయి. గోండా జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ఓ మహిళ ఆదివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న బాలుడికి ఆక్సిజన్ అందించడానికి వేరే వార్డుకు తరలించగా, కొన్ని గంటలకు బాలుడు మరణించాడని సిబ్బంది తెలిపారు.
మృతదేహంపై కొరికినట్టు ఉండటాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలుకలు కొరడంతోనే బిడ్డ మరణించాడని, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. బహెరిచ్ జిల్లాలోని గాడ్రియాన్ గ్రామంలో ఇద్దరు ఆడ శిశువుల మృతదేహాలను గుర్తించారు. ఓ చెరువు సమీపంలో ఒక మృతదేహాన్ని, చెరువులో కొట్టుకుపోతున్న మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొయిన్పురి జిల్లాలో 12 ఏండ్ల బాలికను అపహరించిన ఆరుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బరేలీ జిల్లాలో ఐదేండ్ల చిన్నారిపై ఒకడు లైంగికదాడికి పాల్పడ్డాడు.