మథుర: సుమారు 500 కిలోల గంజాయి(మారిజోనా)ని ఎలుకలు తినేసినట్లు యూపీలోని మథుర పోలీసులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ కోర్టుకు సమర్పించిన రిపోర్ట్లో పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. షేర్ఘర్, హైవే పోలీస్ స్టేషన్లలో దాచిపెట్టిన మారిజోనాను ఎలుకలు తిన్నాయని ఆ రిపోర్ట్లో తెలిపారు.
వేర్వేరు దాడుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 586 కేజీల గంజాయిని సరెండర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు విచారణకు హాజరైన పోలీసులు ఆ గంజాయి ఆకుల్ని ఎలుకలు తిన్నట్లు చెప్పారు. షేర్ఘర్, హైవే పోలీస్ స్టేషన్ రెండు ఘటనల్లో 386, 195 కేజీల మారిజోనాను సీజ్ చేసింది.
పోలీసు స్టేషన్లో ఎలుకల నుంచి దాచి పెట్టే వస్తువు ఏదీ లేదని, ఇక సీజ్ చేసిన దాంట్లో కొంత గంజాయిని ఆఫీసర్లు తగలబెట్టేశారని పోలీసు ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. చిన్న సైజులో ఉండే ఎలుకలు పోలీసులకు భయపడడంలేదని, ఈ సమస్యను పరిష్కరించడంలో పోలీసులు కూడా నిపుణులు కాదు అని ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
ఎలుకలు గంజాయి తిన్నాయని చెప్పడానికి సాక్ష్యాధారాలు చూపించాలని నార్కోటిక్ కోర్టు నవంబర్ 18వ తేదీన ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నది. ఎలుకల్ని చంపేసి, ఆధారాల్ని చూపించాలని మథుర ఎస్పీకి ఆదేశించారు.