Manipur Protest | న్యూఢిల్లీ, జూన్ 1: మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన భీకర హింస వెనుక బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఇతర హిందూత్వ సంఘాల హస్తం ఉన్నదని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్సీఎన్) ఆరోపించింది. మైతీ వేర్పాటువాదులు ప్రత్యేకంగా చర్చిలనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. కుకీ, నాగాల చర్చిలతోపాటు మైతీ తెగకు చెందిన చర్చిలను కూడా మైతీ వేర్పాటువాదులు ధ్వంసం చేస్తున్నారని తెలిపింది. ఈ ఘటనలే హిందూత్వ సంఘాల ప్రమేయాన్ని తెలుపుతున్నాయని ఎన్ఎస్సీఎన్ జనరల్ సెక్రటరీ నికెతు ఇరళు ఆరోపించారు. మణిపూర్లో 200 చర్చిలు, 115 గిరిజన గ్రామాలను తగ్గులబెట్టారని, 68 మంది గిరిజనులను చంపివేశారని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మణిపూర్ ట్రైబల్ ఫోరం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్లో పర్యటిస్తున్న సమయంలో కూడా మైతీ వేర్పాటువాదులు కాంగ్పోక్పీ ప్రాంతంలో 585 గిరిజనుల ఇండ్లను తగులబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
మణిపూర్లో జరుగుతున్న హింసకు రిజర్వేషన్ల అంశం కారణం కాదని, దీని అసలు లక్ష్యం నాగా, కుకీ, మిజో, జోమీ, హమర్ తదితర గిరిజన జాతులను అంతం చేయటమేనని మణిపూర్ ట్రైబల్ ఫోరం ఆరోపించింది. ఈ హింసకు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్సింగ్, బీజేపీ రాజ్యసభ ఎంపీ లీషెంబా సనజోబా పరోక్ష మద్దతు ఉన్నదని తెలిపింది. హింసలో వీరి హస్తంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. భద్రతా బలగాలే మైతీ వేర్పాటు వాదులకు ఆయుధాలందిస్తున్నాయని ఆరోపణలు చేసింది.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత, ఈశాన్య రాష్ర్టాలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 371పై బీజేపీ గురిపెట్టిందని ఇరళు ఆరోపించారు. ఈశాన్య రాష్ర్టాల ప్రజలకు ఢిల్లీపై (కేంద్రం) ఇప్పటికే నమ్మకం సడలిపోయిందని, పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ ఈ ప్రాంతంలో వేర్పాటువాదం చెలరేగవచ్చని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ను తొలగించటం బీజేపీ ప్రతీకార చర్యేనని, అదే విధానాన్ని ఈశాన్య రాష్ర్టాలపై అమలు చేస్తున్నదని ఆరోపించారు.
మైనారిటీ గిరిజన తెగలపై మెజారిటీ మైతీలను ఎగదోస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్సింగ్పై ఆయన సొంతపార్టీ బీజేపీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు మొదలుపెట్టారు. బీరేన్సింగ్ను తక్షణం సీఎం పదవి నుంచి తప్పించాలని కుకీ తెగకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సీఎం తీరును నిరసిస్తూ ఇప్పటికే మణిపూర్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్, మణిపూర్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, సీఎం సలహాదారు పదవుల్లో ఉన్నవారు పదవులకు రాజీనామా చేశారు. వీరంతా బీజేపీ ఎమ్మెల్యేలే. మణిపూర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సీఎంపై అవిశ్వాసం వ్యక్తం చేసింది. అల్లర్లపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. కుకీ, మిజో, జోమీ, హమర్, నాగా తెగల గిరిజన నేతలు బీజేపీ ప్రభుత్వంపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.