న్యూఢిల్లీ, మార్చి 24: నాలుగేండ్ల క్రితం నవంబర్ నెలలో వాతావరణ శాస్త్రవేత్తలు బంగాళాఖాతంలో అల్పపీడనాన్ని గుర్తించారు. తుఫానుగా మారే అవకాశం ఉండటంతో నాలుగంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మార్గదర్శకాలను విడుదల చేశారు. అయితే, వాటిని విడుదల చేసేలోగానే అల్పపీడనం తుఫానుగా మారి కేరళ, తమిళనాడు, లక్షదీవులను తాకి విధ్వంసం సృష్టించింది. 2020 మే నెలలో బెంగాల్ను కకావికలం చేసిన అంఫన్ తుఫాన్ కేవలం 18 గంటల్లో అల్పపీడనం నుంచి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది.
2019లో ఒడిశా తీరంలో బంగాళాఖాతంలోనే ఏర్పడిన అల్పపీనడం ఫణి తుఫానుగా మారడానికి ఆరున్నర రోజుల సమయం పట్టింది. కానీ, తుఫాను కేంద్రం సముద్రంలో బలమైన గాలి ప్రవాహాలను కూడదీసుకొని భారత తూర్పు తీరంలో పెను విధ్వంసాన్ని సృష్టించి వెళ్లిపోయింది. అరేబియా సముద్రంలో గతంలో ఏడాదికి 1-2 తుఫాన్లు సంభవించేవి. కానీ ఇటీవలి కాలంలో ఈ సంఖ్య పెరిగింది. బంగాళాఖాతంలో కంటే అరేబియాలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దీనికంతటికీ కారణం హిందూ మహాసముద్ర ఉపరితల జలాలు వేగంగా వేడెక్కడమేనని నిపుణులు చెప్తున్నారు.
భవిష్యత్తులో మరింత విధ్వంసక తుఫాన్లు
హిందూ మహా సముద్రం నుంచి వీచే గాలి ప్రవాహాలే భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం. కొన్నేండ్లుగా హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతున్నది. సముద్ర ఉపరితల జలాలు వేడెక్కితే గాలి ప్రవాహ వేగం పెరుగుతుంది. ప్రస్తుతం తుఫాన్లు తీవ్రంగా, అనూహ్యంగా ఉండటానికి ఇదే కారణం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత విధ్వంసకరమైన తుఫాన్లు సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు.
శాస్త్రవేత్తలకు కొత్త సవాళ్లు
అల్పపీడనం తుఫానుగా మారడానికి 4 రోజులు పడుతుంది. ఇటీవల దీనికి ముందో.. ఆలస్యంగానో తుఫాన్లు సంభవిస్తున్నాయి. అనూహ్య వాతావరణ పరిస్థితులు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఒకే కాలంలో తుఫాన్లలో కొన్ని వేగంగా సంభవించడం, మరికొన్ని నెమ్మదిగా రావడం శాస్త్రవేత్తల్లో ఆందోళన కలిగిస్తున్నది. వాతావరణ హెచ్చరికలు జారీ చేయడంలో శాస్త్రవేత్తలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వాతారవణ మార్పులే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.