న్యూఢిల్లీ: భర్త లేని తనను బెదిరించి మళ్లీమళ్లీ అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిపై ఓ మహిళ పగతో రగిలిపోయింది. అతడు పెట్టే హింసను భరిస్తూ అదను కోసం ఎదురుచూసింది. దాదాపు ఆరు నెలల హింస భరించిన తర్వాత అదను చూసి హతమార్చింది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రీ పార్క్ సమీపంలోగల బేలా ఫామ్ దగ్గర గత శనివారం రాత్రి ఈ హత్య జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈశాన్య ఢిల్లీ వాసి అయిన ఓ మహిళ భర్త ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆ మహిళ ఒంటరిగా ఉంటోంది. ఆమె ఒంటరితనాన్ని అలుసుగా తీసుకున్న స్థానిక వ్యక్తి ఆమె ఇంట్లో చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా మళ్లీమళ్లీ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు.
దాంతో బాధిత మహిళ ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లడంతో అతను సానుభూతి చూపించాడు. అనంతరం బాధిత మహిళ అభ్యర్థన మేరకు ఆ రేపిస్టును హతమార్చేందుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరూ కలిసి అతడిని బేలా ఫార్మ్ దగ్గరకు రప్పించారు. అతడు రాగానే ఇద్దరూ కత్తులతో దాడి చేసి హతమార్చారు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఆదివారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.