బెంగళూరు: భార్యపై లైంగిక దాడి కూడా అత్యాచారమే అని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ దారుణ నేరానికి పాల్పడిన మృగం భర్త అయినప్పటికీ కేసు నమోదు చేయాల్సిందేనని పేర్కొంది. వైవాహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన ఒక కేసుపై ఈ మేరకు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. కర్ణాటకకు చెందిన ఒక మహిళ, తన భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించి. దీనిపై విచారణ జరిపిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘భర్త అయినప్పటికీ మనిషి మనిషే. భర్త అయిన పురుషుడి లైంగిక దాడి దారుణమైన నేరమే. భార్య అయిన మహిళపై భర్త అత్యాచారం కూడా అత్యాచారమే’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
అలాగే భార్యపై లైంగిక దాడికి వివాహం లైసెన్స్ కాదని హైకోర్టు తెలిపింది. భార్యపై అత్యాచారానికి ఎలాంటి ప్రత్యేక హక్కును పురుషుడైన భర్తకు వివాహం ఇవ్వదని పేర్కొంది. ‘పురుష అధికారానికి ప్రత్యేక హక్కు లేదా లైసెన్స్ను వివాహ వ్యవస్థ ఇవ్వదు, ఇవ్వకూడదు. క్రూరమైన మృగాన్ని శిక్షించకుండా విడిచిపెట్టేందుకు ఎలాంటి వివాహ వ్యవస్థ అనుమతించదు. అనుమతించకూడదు’ అని వ్యాఖ్యానించింది.
కాగా, ప్రస్తుతం భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 37, వివాహంలో లైంగిక కార్యకలాపాలను మినహాయించింది. దీంతో భార్యపై అత్యాచారం నేరానికి సంబంధించిన విచారణ నుంచి భర్తకు ఇది మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ను తాము పరిగణలోకి తీసుకోలేదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ‘ఒక పురుషుడు నేరానికి (అత్యాచారం) పాల్పడినట్లయితే, అది భర్త అయినప్పటికీ శిక్ష విధించాల్సిందే’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో భార్యపై లైంగిక దాడికి పాల్పడిన భర్తపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
మరోవైపు తమ తీర్పు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించాలా వద్దా అనే దాని గురించి కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ‘భర్త అయినప్పటికీ, ఆమె సమ్మతికి విరుద్ధంగా లైంగిక వేధింపుల వంటి క్రూరమైన చర్యను అత్యాచారంగా పేర్కోలేం. అయితే భర్త తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడితే, ఆ భార్య మానసిక స్థితిపై తీవ్రమైన పరిణామాలుంటాయి. మానసికంగా, శారీరకంగా అది ఆమెపై ప్రభావం చూపుతుంది. భర్తల ఇలాంటి చర్యలు భార్యల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ నిశ్శబ్ద గొంతును చట్ట నిర్మాతలు తప్పనిసరిగా వినాలి’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
కాగా, భర్తలు తమ భార్యలకు పాలకులని, వారి శరీరం, మనస్సు, ఆత్మను ప్రభావితం చేయాలనేది పురాతన ఆలోచన, సంప్రదాయం అని హైకోర్టు తెలిపింది. దీని వల్లనే దేశంలో ఇలాంటి కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని పేర్కొంది. దీంతో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై చట్టసభలే నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.