Ranya Rao case : బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కు ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) టేకోవర్ చేసింది. దేశంలోని వివిధ విమానాశ్రయాల ద్వారా విదేశాల నుంచి దేశంలోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న స్మగ్లర్లపై కన్నేసింది. రన్యారావు స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో మరిన్ని స్మగ్లింగ్ నెట్వర్క్లు అక్రమంగా భారత్కు బంగారం తరలించే అవకాశాలపై సీబీఐని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అప్రమత్తం చేసింది.
దుబాయ్ నుంచి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన రన్యారావును గత సోమవారం రాత్రి డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 14.2 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాను తరచూ దుబాయ్, అమెరికా, యూరప్ వెళ్లే దాన్నని డీఆర్ఐ విచారణలో రన్యారావు అంగీకరించింది. ఈ క్రమంలో రన్యారావు వెనుక అక్రమ స్మగ్లింగ్ నెట్వర్క్ ఏదైనా ఉందా అనే కోణంలో డీఆర్ఐ ఆరా తీస్తోంది. ఈ కేసు విచారణకు డీఆర్ఐ సహకారంతో సీబీఐ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా రెండు టీమ్లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది.
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణాకు సహకరిస్తున్న స్మగర్ల నేషనల్ నెట్వర్క్ను కనిపెట్టడంతోపాటు విమానాశ్రయాల దగ్గర వీరికి ఎవరి నుంచి సహకారం అందుతోందనే విషయాలపై సీబీఐ దర్యాప్తు జరుపనుంది. కస్టమ్స్, పోలీస్, విమానాశ్రయ అధికారులతో సహా ప్రభుత్వాధికారుల ప్రమేయంపై ఆరా తీయనుంది. దర్యాప్తు తదుపరి దశలో రన్యారావును సీబీఐ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.