Randeep Surjewala : బీజేపీ మహిళా ఎంపీ హేమమాలిని గురించి కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సుర్జేవాలకు హర్యానా మహిళా కమిషన్ సమన్లు జారీచేసింది. హర్యానాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నాయకురాలు హేమమాలనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఏప్రిల్ 18న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
హేమామాలినిపై రణ్దీప్ సుర్జేవాలా వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేవిగా, అమర్యాదకరంగా ఉన్నాయని హర్యానా మహిళా కమిషన్ వ్యాఖ్యానించింది. కాగా, బీజేపీ ఐటీ డిపార్టుమెంట్ హెడ్ అమిత్ మాల్వీయ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఈ వివాదాన్ని రాజేసింది. రణ్దీప్ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను రణ్దీప్ సుర్జేవాలా తోసిపుచ్చారు. తాను హేమామాలిని గురించి ఎలాంటి అమర్యాదకర వ్యాఖ్యలు చేయలేదని, ఆమెను కించపర్చాలనే ఉద్దేశం తనకు ఎన్నడూ లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వీడియో ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినదని, అందులో మోసం ఉన్నదని ఆయన ఆరోపించారు. ఇటీవల ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరణలో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.