న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కొత్త పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కొన్ని శతాబ్ధాలు ఎదురుచూశామని, రామ్లల్లా ఇప్పుడు భవ్య మందిరంలో కొలువుదీరినట్లు ఆమె పేర్కొన్నారు. కోట్లాది దేశ ప్రజల ఆశయం నెరవేరిందన్నారు. ఆ పండుగను దేశ ప్రజలు సంబురంగా జరుపుకున్నట్లు ఆమె చెప్పారు. గత ఏడాది భారత్ ఎన్నో విజయాలను సాధించిందన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి స్కీమ్లు ఇండియాను మరింత బలోపేతం చేశాయన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ చాలా వేగంగా ఎదిగిందన్నారు.
ఇటీవల ప్రపంచం రెండు భారీ యుద్ధాలను, కరోనా మహమ్మారిని చూసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితి ఉన్నా.. తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచిందన్నారు. సాధారణ భారతీయులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ముర్ము తెలిపారు. యువ శక్తి, మహిళా సాధికారత, రైతులు, పేదలపైనే భారత అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు.
గరీబీ హటావో అన్న నినాదాన్ని చిన్నపటి నుంచి వింటున్నామని, కానీ తొలిసారి విస్తారమైన స్థాయిలో పేదరిక నిర్మూలన జరిగిందన్నారు. జమ్మూకశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేయడం చరిత్రే అన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న అనేక పనులను గత పదేళ్లలో జాతీయ ప్రయోజనాల కోసం పూర్తి చేశామన్నారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించి, ప్రపంచదేశాల్లో ఇండియా ఐడెంటిటీని బలోపేతం చేశామన్నారు.
మన దేశం ఆసియా క్రీడల్లో భారత్ వంద పతకాలు సాధించిందన్నారు. అటల్ టన్నెల్ను కూడా పూర్తి చేశామన్నారు. ఇటీవల భారత్ ఎన్నో విజయాలు నమోదు చేసిందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా రికార్డు క్రియేట్ చేసిందన్నారు. చంద్రుడిపై దక్షిణ ద్రువం చేరుకున్న తొలి దేశంగా కూడా ఇండియా నిలిచిందన్నారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్లో ప్రభుత్వ పథకాలపై అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి ముర్ము తెలిపారు.