లక్నో: ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు, కృష్ణుడు, శివుడు భారతీయ ముస్లింల పూర్వీకులని అన్నారు. ‘భారతదేశంలోని ముస్లింల పూర్వీకులు రాముడు, కృష్ణుడు మరియు శంకర్ (శివ). అందువల్ల భారతీయ ముస్లింలు కాబా భూమిని చూడవలసిన అవసరం లేదు. ఈ ప్రజలు భారతదేశ భూమి, సంస్కృతికి నమస్కరించాలి’ అని ఆయన చెప్పారు.
భారతీయ ముస్లిం పూర్వీకులు భయంతో ముస్లింలుగా మారారని మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా తెలిపారు. ఇస్లామిక్ మనస్తత్వం కలిగిన తెలివితక్కువ వ్యక్తులు ఇంకా ఉన్నారని, మోడీ, ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో వారి ఆలోచనలు వృద్ధి చెందలేవని అన్నారు. ‘సిరియా, ఆఫ్ఘనిస్థాన్ తరువాత, వివిధ దేశాలకు చెందిన కొందరు వ్యక్తులు ప్రపంచాన్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చాలనుకుంటున్నారు. భారతదేశంలో కొందరికి ఈ మనస్తత్వం కూడా ఉంది. కానీ, కేంద్రం, రాష్ట్రంలోని మోదీ, ఆదిత్యనాథ్ ప్రభుత్వాలు దేశంలో హిందూత్వ, భారతీయ సంస్కృతి జెండాను ఎగురవేశాయి. ఈ మనస్తత్వాన్ని ఓడించాయి’ అని శుక్లా తెలిపారు.
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సమావేశం నేపథ్యంలో ఘాజీల భూమి సంభల్ అంటూ వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి. దీనిపై స్పందించిన మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ టెర్రరిస్టులకు సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇచ్చిన ఫలితంగా ఇలాంటి పోస్టర్లు అంటించారని ఆయన ఆరోపించారు.