బిజ్నోర్, మే 21: బీజేపీ కుట్ర పన్ని భారత కిసాన్ యూనియన్(బీకేయూ)లో చీలిక తెచ్చిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కొంత మందిని తమ వైపుకు లాక్కొన్నంత మాత్రాన బీకేయూ పనితీరుపై ప్రభావం చూపలేరని బీజేపీని ఉద్దేశించి అన్నారు. బీకేయూ నుంచి వెళ్లిపోయిన రాజేశ్ చౌహాన్ నేతృత్వంలో కొత్త యూనియన్ బీజేపీ ప్రయోజనాల కోసమే ఏర్పాటైందని ఆరోపించారు. ఈ నెల 15న బీకేయూ రెండుగా చీలిన సంగతి తెలిసిందే. రాజేశ్ చౌహాన్ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త యూనియన్ పేరు భారతీయ కిసాన్ యూనియన్(అరాజ్నైతిక్).